సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం అందుకోలేకపోయిన టీమిండియా.. రెండో టెస్ట్కు సిద్దమవుతోంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో టీమిండియా బలహీనతలపై ఫోకస్ పెట్టింది. చీలమండ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమైన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో యువ పేసర్ ఆవేశ్ ఖాన్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఆవేశ్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లోను ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే అతన్ని రెండో టెస్ట్కు ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. టెస్ట్ టీమ్ పిలుపును అందుకోవడం ఆవేశ్ ఖాన్కు ఇదే తొలిసారి. గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఆవేశ్ ఖాన్.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 8 వన్డేలు, 19 టీ20లు ఆడి ఓవరాల్గా 27 వికెట్లు పడగొట్టాడు.

మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ, శుభ్మన్ గిల్(26) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి. 256/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) భారీ శతకానికి తోడుగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.