టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ పేసర్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లు తీయడం ద్వారా అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.
ఆఖరి ఓవర్లో విధ్వంసకర బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ సాధించిన మార్కో జాన్సెన్ను ఔట్ చేసిన అర్ష్దీప్ సింగ్ అత్యధిక వికెట్ల రికార్డుతో పాటు టీమిండియాకు విజయాన్నందించాడు. మొత్తం 92 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా అర్ష్దీప్ సింగ్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భువన్వేశ్ కుమార్(90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా(89 వికెట్లను)లను అధిగమించాడు.

ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్దీప్ సింగ్ మరో ఐదు వికెట్లు తీస్తే చాహల్ను కూడా అధిగమించనున్నాడు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సెన్(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 41) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు తలో వికెట్ దక్కింది.
ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి 25 పరుగులు అవసరమవ్వగా.. మార్కో జాన్సెన్ సిక్సర్ బాది టెన్షన్ పెట్టాడు. అయితే ఆ మరుసటి బంతికే అతన్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చిన అర్ష్దీప్ సింగ్ కట్టడిగా బౌలింగ్ చేసి భారత్కు చిరస్మరణీ విజయాన్ని అందించాడు.