సౌతాఫ్రికాతో ఆఖరి టీ20లో భారత్ దుమ్మురేపింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చెలరేగగా.. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తీ, బుమ్రా సత్తా చాటారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించగా.. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.

భారీ లక్ష్య ఛేదనకు తగ్గట్లుగానే సౌతాఫ్రికా శుభారంభాన్ని అందుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. డికాక్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(13) మాత్రం తీవ్రంగా తడబడ్డాడు. అతన్ని వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డికాక్తో జత కలిసిన డెవాల్డ్ బ్రెవిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాంతో సౌతాఫ్రికా 9.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జస్ప్రీత్ బుమ్రా విడదీసాడు. సెంచరీ దిశగా సాగిన డికాక్ను రిటర్న్ క్యాచ్తో బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లోనే డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్తో సఫారీ పతనం మొదలైంది. వరుణ్ చక్రవర్తీ ధాటికి కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(6), డోనవన్ ఫెర్రెయిరా(0) ఒకే ఓవర్లో ఔటవ్వగా.. అతని మరుసటి ఓవర్లో జార్జ్ లిండే(16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు సిక్స్లతో దూకుడు కనబర్చిన మార్కో యాన్సెన్(14)ను బుమ్రా ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయామైంది.