భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భాగంగా లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం 6.30 గంటలకే ఈ మ్యాచ్ టాస్ వేయాల్సి ఉండగా.. ఇంకా వేయలేదు. మైదానాన్ని పొగ మంచు కమ్మేయడంతో టాస్ సాధ్యం కాలేదు. ఇప్పటికే రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. అర గంట తర్వాత మరోసారి పరిశీలించనున్నారు.
పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తేనే మ్యాచ్ ప్రారంభం కానుంది. పొగమంచు ఆటగాళ్ల విజిబిలిటీకి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే అంపైర్లు మ్యాచ్ను ఇంకా ప్రారంభించలేదు. పొగమంచు ప్రభావం తగ్గితేనే మ్యాచ్ మొదలవ్వనుంది. ఆటగాళ్లు మాస్క్లు ధరించి మైదానంలోకి వచ్చారు. ఈ ఐదు టీ20ల సిరీస్లో భారత్2-1తో ఆధిక్యంలో ఉంది.
తొలి మ్యాచ్లో గెలిచిన భారత్.. రెండో టీ20లో ఓడింది. మూడో టీ20లో అద్భుత విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. తాజా నాలుగో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది.

కనీసం ఐదేసి ఓవర్ల ఆట సాధ్యమైతేనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. లేకుంటే రద్దు చేయనున్నారు. సౌతాఫ్రికాతో చివరి రెండు టీ20లకు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ దూరమయ్యాడు. కాలికి గాయం కావడంతో అతను జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడని బీసీసీఐ పేర్కొంది.