ఐదు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో ఆఖరి పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే చివరి టీ20లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 పొగ మంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారింది.
తొలి మూడు టీ20ల్లో రెండు గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలి మూడు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో గిల్ బొటన వేలికి గాయమైందని, చివరి రెండు మ్యాచ్లు ఆడలేడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సిరీస్ గిల్ 4, 0, 28 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్ను టీమిండియా మేనేజ్మెంట్ పక్కనపెట్టింది.

కానీ గిల్ మాత్రం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. సంజూ తర్వాత 15 ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్లో పాకిస్థాన్పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఈ క్రమంలోనే గాయం పేరిట గిల్ను తప్పించారనే వాదన వినిపిస్తోంది. గిల్ దూరమవడంతో సంజూ శాంసన్కు మార్గం సుగుమమైంది. ఆఖరి టీ20లో సంజూనే ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్లో సంజూ చెలరేగితే న్యూజిలాండ్తో సిరీస్లోనూ అతనే ఓపెనర్గా కొనసాగనున్నాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఆడపా దడపా పరుగులు చేసినా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. ఆఖరి టీ20లోనైనా అతను చెలరేగాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఏడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. నాలుగో స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అనారోగ్య సమస్యలతో అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు.
హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉండగా.. శివమ్ దూబే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. సంజూ రాకతో జితేష్ శర్మను తుది జట్టులో కొనసాగిస్తారా? లేదా? అనేది చూడాలి. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తీతో పాటు కుల్దీప్ యాదవ్ను కొనసాగించనున్నారు. మూడో టీ20కి దూరమైన జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండటంతో హర్షిత్ రాణాపై వేటు పడనుంది. అర్ష్దీప్ సింగ్ నిలకడగా రాణించాల్సి ఉంది.
భారత్ తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్.
భారత టీ20 టీమ్
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ,సంజూ శాంసన్, షెహ్బాజ్ నదీమ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.