భారత్ వర్సెస్ సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దయ్యింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన ఈ మ్యాచ్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదు. మైదానాన్ని పూర్తిగా పొంగమంచు కమ్మేయడంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. పొగమంచు ఆటగాళ్ల విజిబిలిటీకి అడ్డంకిగా మారడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లక్నో గాలి నాణ్యత సూచిక(AQI) అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది
పొగమంచు మధ్య బంతి ఆటగాళ్లకు కనబడదని, ఈ పరిస్థితుల్లో ఆటను కొనసాగించడం ఆటగాళ్లకు శ్రేయాస్కారం కాదని భావించిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో ప్రేక్షకులు నిరాశగా మైదానం వీడారు.
ఈ ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్లో గెలిచిన భారత్.. రెండో టీ20లో ఓడింది. మూడో టీ20లో అద్భుత విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. కానీ భారత ఆశలపై పొగమంచు నీళ్లు చల్లింది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ అనంతరం జనవరిలో న్యూజిలాండ్తో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు టీమిండియా ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకంగా మారింది. అయితే మెగా టోర్నీకి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేలవ ఫామ్ భారత్ను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లోనైనా ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంది.
కాలి గాయంతో సౌతాఫ్రికాతో చివరి రెండు టీ20లకు శుభ్మన్ గిల్ దూరమయ్యాడు. నాలుగో టీ20కి ముందు ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్మన్ గిల్ బొటన వేలికి గాయమైందని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో 4, 0, 28 పరుగులతో 32 పరుగులే చేశాడు. గత 15 మ్యాచ్ల్లో 24.25 సగటు, 137.26 స్ట్రైక్రేట్తో 291 పరుగులే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.