IND vs SA: మూడు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది.
సూర్యకు తోడుగా యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేకపోయినా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే శుభ్మన్ గిల్(12), తిలక్ వర్మ(0) వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి యశస్వి జైస్వాల్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 62 పరుగులు చేసింది.
ఆదుకున్న యశస్వి, సూర్య..
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 32 బంతుల్లో సూర్య అర్థ సెంచరీ సాధించాడు. 112 పరుగులతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ టబ్రైజ్ షంసీ విడదీసాడు. దూకుడుగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
సూర్య సూపర్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ సాయంతో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్స్లతో అభిమానులను అలరించాడు. రింకూ సింగ్(14) క్యాచ్ ఔట్గా వెనుదిరిగినా.. జితేశ్ శర్మ సాయంతో 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్యకు ఇది నాలుగో శతకం కావడం విశేషం.
సెంచరీ అనంతరం సూర్య క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన జడేజా బౌండరీ బాది.. మరుసటి బంతికి రనౌటయ్యాడు. ఆ వెంటనే జితేశ్ శర్మ హిట్ వికెట్ అయ్యాడు. ఇక సిరాజ్ చివరి బంతికి క్విక్ డబుల్ తీసి జట్టు స్కోర్ను 200 ధాటించాడు.