IND vs SA 3rd ODI: టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 108) సెంచరీతో కదం తొక్కాడు. దాంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్తో పాటు తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్(3/63) మూడు వికెట్లు తీయగా.. నండ్రె బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లిజా విలియమ్స్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అరంగేట్ర ప్లేయర్ రజత్ పటీదార్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. క్లాస్ షాట్స్తో ఆకట్టుకున్నాడు. అదే జోరులో నండ్రె బర్గర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్(10) విఫలమవ్వగా.. కేఎల్ రాహుల్(21) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.
దాంతో టీమిండియా 101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. తిలక్ వర్మ 75 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కేశవ్ మహరాజ్ విడదీసాడు. తిలక్ వర్మను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ సాయంతో సంజూ శాంసన్ 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో అతన్ని విలియమ్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. అక్షర్ పటేల్(1), వాషింగ్టన్ సుందర్(14) విఫలమవ్వగా.. రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు.