భారత్- సౌతాఫ్రికా మూడో వన్డేకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 6న జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత వైజాగ్ వేదికగా భారత పురుషుల వన్డే మ్యాచ్ జరుగుతుండటం.. వెటరన్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్పై విపరీతమైన బజ్ నెలకొంది.
దాంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేసేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ల సేల్స్ గురించి తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మైదానం సీటింగ్ కెపాసిటీ 27,500 కాగా.. 22000 వేల టికెట్లను ఆన్లైన్లో అమ్మనున్నారు.
నవంబర్ 28 నుంచి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ వేదికగా టికెట్లు సేల్ చేయనున్నారు. టికెట్ ధరలు రూ.1200, రూ.2000, రూ.2500, రూ.3000, రూ.3500, రూ.4000, రూ.5000, రూ. 10000, రూ.15000, రూ. 18000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్లన్నీ ఆన్లైన్ వేదికగానే అమ్మనున్నారు.

నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఈ మూడు వన్డేల సిరీస్ కోసం ఆదివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మెడ నొప్పితో కెప్టెన్ శుభ్మన్ గిల్.. ప్లీహం గాయంతో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా ఎంపికయ్యాడు.
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకు రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్మెంట్.. గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యాను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ అవకాశం దక్కగా.. తిలక్ వర్మకు కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాడు. పేసర్లుగా అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రసిధ్ కృష్ణలు ఎంపికవ్వగా.. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.