సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లోనూ టీమిండియా ఘోర పరాజయం దిశగా సాగుతోంది. ముందుగా బౌలింగ్లో తేలిపోయిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్లోనూ తడబడుతోంది. సఫారీ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోతున్నారు. వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్(97 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 58) ఒక్కడే కాస్త పోరాడగా.. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) దారుణంగా విఫలమయ్యారు. దాంతో 122 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

బ్యాటింగ్లో ఔటాఫ్ సిలబస్లా దూసుకొచ్చి దుమ్మురేపిన మార్కో జాన్సెన్.. బౌలింగ్లోనూ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు సిమన్ హర్మర్ రెండు వికెట్లతో చెలరేగాడు. దాంతో టీమిండియాకు కోలుకోలేని దెబ్బపడింది. ఇన్నింగ్స్ తేడాతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకునే దిశగా భారత్ సాగుతోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత్ మాత్రం సౌతాఫ్రికా చేసిన స్కోర్లో సగం కూడా చేయలేక చేతులెత్తేసి ఫాలో ఆన్ ఆడే పరిస్థితిని తెచ్చుకుంది.
రెండో ఇన్నింగ్స్లో అద్భుతం చేసి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేస్తే తప్పా ఈ మ్యాచ్లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు లేవు. ఈ మ్యాచ్లో ఓడినా.. డ్రా చేసుకున్నా సిరీస్ 1-0తో సౌతాఫ్రికా కైవసం అవుతుంది. తొలి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అదే జరిగితే గౌతమ్ గంభీర్ కోచింగ్ కెరీర్లోనే ఈ పరాజయం ఓ మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇప్పటికే న్యూజిలాండ్తో సొంతగడ్డపై 0-3తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. మరో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి.