భారత్తో రెండో వన్డేలో సౌతాఫ్రికా బౌలర్లు తీవ్రంగా తడబడ్డారు. తొలి రెండు ఓవర్లలోనే 10 ఎక్స్ట్రా సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలి ఓవర్ను నండ్రే బర్గర్ వేసాడు. తొలి బంతినే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీ తరలించగా.. రెండో బంతిని వైడ్ వేసాడు. మూడో బంతి కూడా వైడ్ వేయగా.. కీపర్ క్వింటర్ డికాక్ అందుకోలేకపోయాడు. దాంతో బంతి బౌండరీ వెళ్లిపోయింది. తర్వాతి నాలుగు బంతులు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నండ్రే బర్గర్.. ఆఖరి బంతికి జైస్వాల్ బౌండరీ బాదాడు. తొలి ఓవర్లో బర్గర్ 8 బంతులు వేసాడు.
రెండో ఓవర్ వేసిన లుంగి ఎంగిడి వరుసగా మూడు బంతులు వైడ్ వేసాడు. మరో బాల్ కూడా వైడ్ వేయడంతో తొలి రెండు ఓవర్లలోనే 10 ఎక్స్ట్రాలు వచ్చాయి. ఈ ఓవర్లో లుంగి ఎంగిడి మొత్తం 10 బంతులు వేసాడు. దాంతో తొలి రెండు ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఇందులో 10 పరుగులు ఎక్స్ట్రాల ద్వారానే వచ్చాయి. తొలి వన్డేలోనూ సౌతాఫ్రికా భారీగా ఎక్స్ట్రాలు సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. రెండో వన్డేలోనూ అదే తప్పిదాన్ని పునరావృతం చేసింది.

ఆచితూచి ఆడిన భారత ఓపెనింగ్ జోడీని నండ్రే బర్గర్ విడదీసాడు. రోహిత్ శర్మ(14)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే యశస్వి జైస్వాల్(22)ను మార్కో యాన్సెన్ ఔట్ చేయడంతో 62 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. క్రీజులో సెట్ అవ్వడానికి సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత పోటాపడి పరుగులు రాబట్టింది.
52 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్.. 47 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మరింత దూకుడగా ఆడిన ఈ జోడీ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ బౌండరీల మోత మోగించాడు. 77 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న రుతురాజ్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మార్కో యాన్సెన్ బౌలింగ్లో రుతురాజ్(105) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.