టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో గైక్వాడ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. గైక్వాడ్కు ఇది కెరీర్లో తొలి సెంచరీ. అయితే రాయ్పూర్ వేదికగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్రకెక్కాడు.
ఇక్కడ ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జరగ్గా.. న్యూజిలాండ్తో ఒక వన్డే మ్యాచ్ జరిగింది. మళ్లీ ఇప్పుడే సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్కు రాయ్పూర్ ఆతిథ్యం ఇచ్చింది. రాయ్పూర్ వేదికగా రోహిత్ శర్మ చేసిన 51 పరుగులే అత్యధిక స్కోర్గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ ఆ రికార్డ్ను అధిగమించాడు.

గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అవకాశం అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. తనపై గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రిషభ్ పంత్, తిలక్ వర్మను కాదని తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నెంబర్ 4 బ్యాటర్గా బరిలోకి దిగి విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 77 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105)తో పాటు విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు.