భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. సెంచూరియన్ వేదికగా మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆలస్యంగా ప్రారంభమైన తొలి రోజు ఆట.. రెండు సెషన్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది.
మూడో సెషన్ ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 70 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనికి మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) అండగా నిలిచాడు.

వర్షం ఆగితేనే మ్యాచ్ ప్రారంభం కానుంది. లేకుంటే మూడో సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుంది. సెంచూరియన్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం బుధవారం కూడా వర్షం పడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పేస్కు అనుకూలంగా ఉన్న పిచ్పై సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ, అయ్యర్ నాలుగో వికెట్కు 88 పరుగులు జోడించారు. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరు వెనుదిరగ్గా.. అశ్విన్(8) కూడా నిరాశపరిచాడు.
ఈ పరిస్థితుల్లో శార్తూల్ ఠాకూర్తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. ఏడో వికెట్కు 43 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఔటవ్వగా.. జస్ప్రీత్ బుమ్రా సాయంతో రాహుల్ 80 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనంతరం ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో బుమ్రా(1) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. సిరాజ్ సాయంతో రాహుల్.. జట్టు స్కోర్ను 200 ధాటించాడు.