
లక్నో: భారత్- సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా లక్నో వేదికగా జరగనున్న తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభంకానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో మైదానం తడిసిపోవడంతో అంతరాయం కలిగింది. ఒకటిన్నరకు అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. ఒకవేళ 1.30కు టాస్ పడితే.. 2 గంటలకు ఆట ప్రారంభంకానుంది.
ఈ సిరీస్కు శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు సిద్దమైంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు చేరుకోగా.. ధావన్ సేన లక్నో వేదికగా జరగనున్న తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీ, ఐపీఎల్ స్టార్స్ తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఇండియా-ఏ, దేశవాళీ క్రికెట్తో మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు.. అంతర్జాతీయ స్థాయిలో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. ధావన్, శేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్లో ఉన్న సిరాజ్, దీపక్ చాహర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. మరోవైపు రజత్ పటీదార్, షెహ్బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటి దేశీయ స్టార్లు అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.
ఎకనా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలమైనది. ఇక్కడ జరిగిన మూడు వన్డేల్లో యావరేజ్ స్కోర్ 230 పరుగులే. బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. అయితే టీ20ల్లో మాత్రం భారీ స్కోర్లు నమోదయ్యాయి. వర్షం వస్తుండటంతో పిచ్పై కవర్లు కప్పి ఉంచారు. కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.