ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్కు ముందు ప్రెసిడెంట్ ఎలెవన్తో జరిగిన సన్నాహక మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. శుభ్మన్ గిల్(62 బంతుల్లో 7 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42), వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 5 ఫోర్లతో 42 నాటౌట్), యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 9 ఫోర్లతో 45) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. దాంతో ఈ సన్నాహక మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండు రోజుల ఈ వామప్ మ్యాచ్లో తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. కాన్బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు. దాంతో అంపైర్లు తొలి రోజును ఆటను రద్దు చేశారు. రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ప్రధాని ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ సామ్ కోన్స్టాస్(97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 107) సెంచరీతో రాణించగా.. టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్ దీప్(2/58) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క వికెట్ దక్కలేదు. ఈ సన్నాహక మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(27), రవీంద్ర జడేజా(27) పర్వాలేదనిపించగా.. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(3) తీవ్రంగా నిరాశపరిచాడు. సర్ఫరాజ్ ఖాన్(1) కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ సన్నాహక మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేదు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.