ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్ ముంగిట ప్రైమ్మినిస్టర్ ఎలెవన్తో జరుగుతున్న పింక్ బాల్ వార్మప్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు రోజుల ఈ వామప్ మ్యాచ్లో తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.
కాన్బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు. దాంతో అంపైర్లు తొలి రోజును ఆటను రద్దు చేశారు. రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ రోజు కూడా వర్ష సూచన ఉండటంతో ఈ మ్యాచ్ సాగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్కు చాలా కీలకం. వ్యక్తిగత కారణాలతో రోహిత్.. గాయంతో శుభ్మన్ గిల్ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఈ ఇద్దరికీ కీలకంగా మారింది. మ్యాచ్ ప్రాక్టీస్తో పాటు ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని ఈ ఇద్దరు బ్యాటర్లు భావిస్తున్నారు. పింక్ బాల్ మ్యాచ్లు ఎక్కువగా ఆడని భారత్ జట్టు మొత్తానికి కూడా ఈ సన్నాహక మ్యాచ్ చాలా కీలకం.
శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. పెర్త్ వేదికగా సంచలన ప్రదర్శనతో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్.. అదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను భారత్ 4-0, లేదా 4-1తో కైవసం చేసుకోవాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2025లో భారత్కు ఇదే చివరి టెస్ట్ సిరీస్.