పింక్ బాల్ సన్నాహక మ్యాచ్లో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (4/44) నిప్పులు చెరిగాడు. వర్షం అంతరాయం కారణంగా 50 ఓవర్లకు కుదించిన ఈ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రధాని ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది.
ఓపెనర్ సామ్ కోన్స్టాస్(97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 107) సెంచరీతో రాణించగా.. టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

బౌలింగ్ చేయని బుమ్రా..
భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్ దీప్(2/58) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క వికెట్ దక్కలేదు. ఈ సన్నాహక మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు.
రెండు రోజుల ఈ వామప్ మ్యాచ్లో తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. కాన్బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు. దాంతో అంపైర్లు తొలి రోజును ఆటను రద్దు చేశారు. రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.
నిప్పులు చెరిగిన బౌలర్లు..
టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. అరగంట అంతరాయం తర్వాత ఆట తిరిగి ప్రారంభమవ్వగా.. భారత బౌలర్లు తమ పనిని మొదలుపెట్టారు. ఓపెనర్ మ్యాట్ రేన్షా(5) సిరాజ్ ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే జయ్డెన్ గుడ్విన్(4)ను ఆకాశ్దీప్ పెవిలియన్ చేర్చాడు.
ఈ పరిస్థితుల్లో జాక్ క్లేటన్(40)తో కలిసి సామ్ ఆదుకున్నాడు. మూడో వికెట్కు 109 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హర్షిత్ రాణా విడదీసాడు. జాక్ క్లేటన్ను క్లీన్ బౌల్డ్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన ఓలీవర్ డేవిస్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
WHAT A BALL FROM HARSHIT RANA ⚡
— Johns. (@CricCrazyJohns) December 1, 2024
- India continues their dominance in Australia...!!!! pic.twitter.com/YNjS77gQaf
6 బంతుల్లో 4 వికెట్లు..
తన మరుసటి ఓవర్లో బంతి వ్యవధిలోనే కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్(1), సామ్ హర్పర్(0)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. 6 బంతుల వ్యవధిలోనే హర్షిత్ రాణా 4 వికెట్లు తీయడం గమనార్హం. దాంతో పీఎమ్ ఎలెవన్ 133 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎయిడెన్ ఓ కార్నర్(4) ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో ఆ జట్టు ఆలౌట్ దిశగా సాగింది.
కానీ హన్నో జాకోబ్స్(61) అసాధారణ బ్యాటింగ్తో 8వ వికెట్కు 65 పరుగులు జోడించడంతో పీఎమ్ ఎలెవన్ 200 పరుగుల మార్క్ను ధాటగలిగింది. చివరి వికెట్గా జాకోబ్స్ను సుందర్ ఔట్ చేయడంతో పీఎమ్ ఎలెవన్ ఇన్నింగ్స్కు తెరపడింది.