ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్థాన్ దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఈ మ్యాచ్కు ఇంకా సమయం ఉన్నా.. క్రికెట్ అభిమానులకు అప్పుడే భారత్-పాక్ ఫీవర్ అంటుకుంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలతో ఈ మ్యాచ్పై హైప్ క్రికెట్ చేస్తున్నారు. తాజాగా జియోహాట్స్టార్ షోలో యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ కంటే పాకిస్థాన్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని యువరాజ్ సింగ్ అభిప్రాయపడగా.. అఫ్రిది మాత్రం భారత్లోనే ఎక్కువ మ్యాచ్ విన్నర్లు ఉన్నారని తెలిపాడు. దుబాయ్ మైదానం పరిస్థితులు భారత్ కంటే పాకిస్థాన్కు ఎక్కువ అనుకూలంగా ఉంటాయని యువరాజ్ సింగ్ తెలిపాడు. పాకిస్థాన్కు దుబాయ్లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉందన్నాడు.

పాకిస్థాన్కే అడ్వాంటే..
'దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో పాకిస్థాన్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని భావిస్తున్నా. ఎందుకంటే భారత్ కంటే వారే అక్కడ ఎక్కువ క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు పాక్ ఆటగాళ్లకు అలవాటే. స్లో వికెట్పై బౌలింగ్, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు.'అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
దశాబ్దానికి పైగా పాకిస్థాన్ అంతర్జాతీయ మ్యాచ్లు జరగనప్పుడు పాకిస్థాన్ తమ హోమ్ మ్యాచ్లను యూఏఈ వేదికగా ఆడింది. దాంతో అక్కడి మైదానాలపై వారికి పట్టు ఉంది. మరోవైపు దుబాయ్ భారత రికార్డ్ కూడా మెరుగ్గానే ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు యూఏఈ వేదికగా భారత్ ఒక్క మ్యాచ్ ఓడలేదు. ఇప్పటివరకు ఏడు వన్డేలు ఆడిన భారత్ 6 గెలవగా.. మరొకటి టై అయ్యింది.
బలహీనంగా పాకిస్థాన్..
మరోవైపు షాహిద్ అఫ్రిది మాత్రం భారత్తో పోల్చితే పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. 'పాకిస్థాన్ కంటే భారత జట్టులోనే ఎక్కువ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మ్యాచ్ విన్నర్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే ఆటగాడు. ప్రస్తుతం పాక్ టీమ్లో అలాంటి ఆటగాళ్లు లేరు. భారత్ బలం మిడిలార్డర్, లోయరార్డ్ బ్యాటర్లు. దాంతో భారత్ మ్యాచ్లు గెలుస్తోంది.
చాలా కాలం మేం ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. కానీ ఎవరూ నిలకడగా ఆడటం లేదు. భారత్తో పోల్చితే పాకిస్థాన్ బలహీనంగా ఉంది. కానీ భారత్-పాక్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించిన జట్టునే విజయం వరిస్తోంది. సమష్టి ప్రదర్శన కీలకం.'అని తెలిపాడు.