న్యూఢిల్లీ: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీహాట్స్టార్లకు కాసుల వర్షం కురిపించనుంది. మెగా టోర్నీ అడ్వర్టైజమెంట్స్కు సంబంధించిన రేట్ కార్డ్ను డిస్నీ హాట్స్టార్ ప్రకటించిందని exchange4media పేర్కొంది.
ఈ వివరాల ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా 10 సెకన్లకు రూ.30 లక్షల రూపాయలు వసూలు చేయాలని డిస్నీహాట్స్టార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ ఓటీటీ రైట్స్ కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్నీ హాట్స్టార్ ఆ లోటును తీర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందని పేర్కొంది.

ఇప్పటికే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ఫ్రీగా అందిస్తామని ప్రకటించిన డిస్నీ హాట్స్టార్.. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ను అమాంతం పెంచేసింది. కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజును రూ.150 కోట్లుగా నిర్ణయించిన హాట్స్టార్.. అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 88 కోట్లు వసూలు చేయాలనుకుంటోంది.
హాట్స్టార్ రేట్ కార్డ్ ప్రకారం "పవర్డ్ బై" స్పాన్సర్ల వంటి ప్రముఖ ఎక్స్పోజర్ కావాలనుకునే బ్రాండ్లు తప్పనిసరిగా రూ. 75 కోట్లు చెల్లించాలి. అయితే అసోసియేట్ స్పాన్సర్షిప్ను ఎంచుకునే వారు మాత్రం రూ. 40 కోట్ల బడ్జెట్ను అందించాల్సి ఉంటుంది.
యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ రేట్లను ప్రత్యేకంగా నిర్ణయించింది. దాయాదుల పోరు సందర్భంగా 10 సెకన్ల యాడ్కు రూ.30 లక్షలు వసూలు చేయనుంది. యావత్ క్రికెట్ ప్రపంచం చూసే ఈ మ్యాచ్కు డిస్నీ హాట్స్టార్ అధిక మొత్తంలో వసూలు చేయడం ఇదే తొలిసారి.
గతంలోనూ హయ్యెస్ట్ వ్యూయర్ షిప్ కలిగిన దాయాదుల పోరుకు ప్రత్యేకంగా అడ్వర్టైజ్ ధరలను నిర్ణయించి వసూలు చేసింది. మార్కెట్లో నెలకొన్న పోటీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అడ్వర్టైజింగ్ ధరలను 30-35 శాతం పెంచాలని నిర్ణయించింది.
గత వరల్డ్ కప్లో డిస్నీ హాట్స్టార్ 10 సెకన్ల యాడ్కు రూ.6 నుంచి 7 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కానీ ఈసారి ఆ రేటును పెంచేసింది. ప్రపంచకప్ ద్వారా మొత్తం 1000 కోట్లను ఆర్జించాలని డిస్నీ హాట్స్టార్ లక్ష్యంగా పెట్టుకుంది.