IND vs PAK: రాహుల్ ద్రవిడ్ ట్రాప్లో పడిన పాక్.. ఎలాగంటే..?

దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్లలో ఎవరు గెలుస్తారని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని అడగ్గా ఎవరు తక్కువ తప్పిదాలు చేస్తే వారు విజయం సాధిస్తారని చెప్పాడు.
ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుందో ఏమో గానీ భారత్ ఆ దిశగా ప్రణాళికలు రచించింది. అద్భుతంగా ఆడటమే కాకుండా ప్రత్యర్థితో తప్పిదాలు చేయించేలా వ్యూహాలు రచించింది. అనుకున్న విధంగానే సూపర్ ప్లాన్తో పాకిస్థాన్ను బోల్తా కొట్టించింది.

జడేజాతో నవాజ్కు చెక్..
ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ బాబర్ ఆజామ్ తప్పిదం కారణంగానే పాకిస్థాన్ ఓడిపోయిందన్నాడు. స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ను సరిగ్గా వాడుకోలేకపోయాడని, టీ20 ఫార్మాట్లో చివరి నాలుగు ఓవర్లను స్పిన్నర్లతో వేయించడం నేరమని తెలిసినా అదే పని చేసాడని విమర్శించాడు.
12 ఓవర్ తర్వాత మళ్లీ ఒక్కసారి కూడా అతనికి బంతినివ్వలేదని, అప్పటికే రెండు కీలక వికెట్లు తీసిన నవాజ్కు 13 లేదా 14వ ఓవర్ ఇవ్వాల్సిందన్నాడు. అయితే నవాజ్ను బాబర్ పక్కనపెట్టేలా చేసింది టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడే. అవును రవీంద్ర జడేజాను నాలుగో స్థానంలో ఆడించి నవాజ్తో బౌలింగ్ చేయించకుండా చెక్ పెట్టాడు.

ట్రాప్లో పడి..
ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్.. ఆఖరి బంతికి భారత కెప్టెన్ రోహిత్ శర్మని ఔట్ చేశాడు. ఆ తర్వాత 10వ ఓవర్లో మళ్లీ బౌలింగ్కి వచ్చిన నవాజ్ ఫస్ట్ బాల్కే విరాట్ కోహ్లీని ఔట్ చేసేశాడు. ఈ నేపథ్యంలో.. అతనితో కుడిచేతి వాటం బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్కి ప్రమాదం రాబోతోందని ముందే గ్రహించిన టీమిండియా మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపింది. అలానే అతనిపై ఎదురుదాడి చేయాలని కూడా జడేజాకి సూచించింది.
దాంతో కోహ్లీ ఔటైపోయిన ఓవర్లోనే క్రీజు వెలుపలికి వెళ్లి మరీ నవాజ్కి జడేజా ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో అతను మళ్లీ బౌలింగ్కి రాగానే మరోసారి జడేజా పెద్ద షాట్ ఆడి బౌండరీ బాదేశాడు. దాంతో.. పాకిస్థాన్ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. జడేజా ఉన్నంతసేపు అతడితో బౌలింగ్ చేయించకూడదని నిర్ణయించుకుంది. ఇక్కడే భారత్ ట్రాప్లో పాక్ పడింది.

పంత్తో సందేశం..
మహ్మద్ నవాజ్కి మిగిలిన ఉన్న నాలుగో ఓవర్ని వేయించకుండా పాక్ వెనక్కి నెడుతూ వచ్చింది. దాంతో పాక్ ట్రాప్లో పడిందని నిర్ధారించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. మ్యాచ్ మధ్యలోనే డ్రింక్ బాయ్గా ఉన్న రిషబ్ పంత్ ద్వారా రవీంద్ర జడేజాని ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉండాలని మెసేజ్ పంపించాడు.
దాంతో.. చివరి ఓవర్ వరకూ నవాజ్తో పాక్ బౌలింగ్ చేయించలేకపోయింది. చివరి ఓవర్లో తొలి బంతికే జడేజాను అతను బౌల్డ్ చేశాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత్ విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమైన దశలో జడేజా ఔటైనా.. ఆ తర్వాత నాలుగో బంతికి సిక్స్ బాదిన హార్దిక్ పాండ్య మ్యాచ్ని ముగించేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications