
చెలరేగిన రోహిత్, రాహుల్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్ల రోహిత్ శర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28), కేఎల్ రాహుల్(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 28) శుభారంభం అందించారు. అటాకింగ్ బ్యాటింగ్తో పాక్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ముఖ్య గత మ్యాచ్తో తన స్వింగ్తో బెంబేలెత్తించిన పాక్ యువ పేసర్ నసీమ్ షాకు చుక్కలు చూపించారు.
తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ.. హిట్టింగ్ షురూ చేయగా.. కేఎల్ రాహుల్ సైతం అతన్ని అనుసరించాడు. నసీమ్ షా వేసిన తొలి ఓవర్లో రోహిత్ సిక్స్, బౌండరీతో 11 పరుగులు పిండుకున్నాడు. మహమ్మద్ హస్నైన్ వేసిన రెండో ఓవర్లోనూ రోహిత్ బౌండరీతో అదే జోరు కొనసాగించాడు. రోహిత్ను చూసి టెంప్ట్ అయిన రాహుల్.. నసీమ్ షా వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. దాంతో భారత్ 5 ఓవర్లలోనే 54 పరుగులు చేసింది.

చేతులెత్తేసిన మిడిలార్డర్..
ఈ జోడీ జోరుకు హ్యారీస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. అతను వేసిన 6వ ఓవర్ తొలి బంతిని రోహిత్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ టైమ్ అవ్వడంతో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. షాదాబ్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే రాహుల్ సైతం భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔట్గా పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతూ అదే జోరును కొనసాగించాడు.
కానీ మహమ్మద్ నవాజ్ అతన్ని క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్(14) చెత్త షాట్తో మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా డకౌటవ్వడంతో భారత్ పరిస్థితి తలకిందులైంది.

ఆదుకున్న కోహ్లీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మహమ్మద్ హస్నైన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని సిక్సర్ బాదిన కోహ్లీ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా గుర్తింపు పొందాడు. విరాట్కు ఇది 32వ హాఫ్ సెంచరీ. 19వ ఓవర్లో దీపక్ హుడా భారీ సిక్సర్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. హరీస్ రౌఫ్ వేసిన చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రవి బిష్ణోయ్ మిస్ ఫీల్డ్తో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. దాంతో టీమిండియా 181 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












