హైదరాబాద్: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో పాటు లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
దాంతో భారత్-పాక్ మధ్య జరిగే సూపర్ 4 మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారు. అయితే భారత్-పాక్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ మండిపడ్డాడు. పనికిమాలిన నిర్ణయాలతో టోర్నీ ని అపహాస్యం చేశారని ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు.

'ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం సిగ్గు చేటు. నిర్వాహకులు తమ చర్యలతో ఈ టోర్నీని అపహాస్యం చేశారు. ఇతర రెండు జట్లకు వేర్వేరు నిబంధనలతో టోర్నీ నిర్వహించడం అనైతికం. అన్ని జట్లకు ఒకే రూల్, ఒకే న్యాయం ఉండాలి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగితే జరిగింది లేకపోతే ఆ రోజే రద్దు చేయాలి.
అంతేగాని ఈ పనికిమాలిన నిర్ణయాలు ఎందుకు? రెండో రోజు అయిన రిజర్వ్ డేలో కూడా వర్షం పడితే ఏం చేస్తారు? ఇటువంటి దురుద్దేశపూరితమైన ప్లాన్స్ విజయవంతం కావు.'అని వెంకటేశ్ ప్రసాద్ రాసుకొచ్చాడు.

భారత్-పాక్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడంపై బంగ్లాదేశ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంక కోచ్ హతురసింగ సైతం.. భారత్-పాక్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడాన్ని తప్పుబట్టాడు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ కోచ్ సిల్వర్వుడ్కు షాకిచ్చింది.
ఇందులో తప్పేమీ లేదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో భాగమైన సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని బీసీబీ స్పష్టం చేసింది.
''వాతావరణ పరిస్థితులను అనుసరించి భారత్-పాక్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారు. ఏసీసీలో భాగమైన నాలుగు దేశాలనూ సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని బీసీబీ పేర్కొంది.