ఆసియా కప్ అండర్ 19 ఫైనల్లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. ఆదివారం పాకిస్థాన్తో జరిగిన తుది పోరులో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత అండర్ 19 జట్టు 191 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అత్యుత్సాహం జట్టు కొంపముంచింది.
మైదాన పరిస్థితులు పట్టించుకోకుండా దూకుడుగా ఆడి వికెట్ పారేసుకోవడం భారత విజయవకాశాలు దెబ్బతీసింది. 10 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 3 సిక్సర్లు, ఫోర్ సాయంతో 26 పరుగులు చేశాడు. 260 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ ఇంకాసేపు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయినా.. వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ పంథాను మార్చుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీ అత్యుత్సాహం కారణంగా ఇతర బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోయారు. పాకిస్థాన్ పేసర్ అలీ రాజా.. నాలుగు వికెట్లు తీయడంతో పవర్ ప్లేలోనే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ వైఫల్యం కూడా భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ పరాజయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్ నిర్ణీ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. సమీర్ మిన్హాస్(113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్లతో 172) భారీ శతకంతో రాణించాడు.
అనంతరం భారత్ అండర్ 19 టీమ్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. అలీ రాజా(4/42) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సయ్యమ్(2/38), అబ్దుల్ సుభమ్(2/29), హుజైఫా అషాన్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు.