
దుబాయ్: ఎంతో ఆతృతగా ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ బిగ్ మ్యాచ్లో ఇండియన్ ఫ్యాన్స్కు తీవ్ర నిరాశే ఎదురైంది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతారనుకున్న భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(8 బంతుల్లో 3), రోహిత్ శర్మ(0) తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్కు ఈ ఇద్దరు విలవిలలాడారు. అతను వేసిన ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా.. అతని మరుసటి ఓవర్లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక సిక్స్, ఫోర్తో జోరు కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కీపర్ క్యాచ్గా వెనుదిరగడంతో భారత 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దాంతో అభిమానులకు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి. ఆ మ్యాచ్లో చేజింగ్కు దిగిన భారత్.. అప్పటి పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ధాటికి ఆరంభంలోనే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీల వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ ఆ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు కూడా ఆరంభంలోనే ఓపెనర్లు ఔటవ్వడం.. ఆ తర్వాత సూర్యకుమార్ కూడా వెనుదిరగడంతో అదే పరిస్థితి రిపీట్ అవుతుందా? అని అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు.
ఓపెనర్లు ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్య తనదైన షాట్లు ఆడటంతో భారత అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు ఓపెనర్లు ఔటైన షాహిన్ షా అఫ్రిది బౌలింగ్లోనే సూర్య సిక్స్ కొట్టి తన క్లాస్ బ్యాటింగ్ను చాటుకోవడంతో అభిమానులంతా అతనిపై పూర్తి భరోసా ఉంచారు. మరోవైపు కోహ్లీ సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంతో భారత్ గట్టెక్కిందని అంతా భావించారు. కానీ హసన్ అలీ బౌలింగ్లో బంతిని తప్పుగా అంచనా వేసిన సూర్య కుమార్ యాదవ్(11) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 39 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(20 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(4 బ్యాటింగ్) ఉన్నాడు.