
దుబాయ్: ఏదైతో జరుగకూడదో అనుకున్నామో అదే జరిగింది. కలలో కూడా ఊహించని ఫలితం ఎదురైంది. ఎంతో ఆశగా ఎదురు చూసిన భారత అభిమానులను ఓటమే వెక్కిరించింది. అవును ఏ మాత్రం జీర్ణించుకోలేని ఫలితం వచ్చింది. అదిరిపోయే ఆటతో గత చరిత్రను పాకిస్థాన్ తిరగరాసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి మెగాటోర్నీలో బోణీ కొట్టింది. ఫలితంగా మెగా టోర్నీల్లో భారత్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ అదిరిపోయే విజయాన్నందుకుంది. చెత్త బ్యాటింగ్తో పాటు పేలవ బౌలింగ్తో భారత్ చేజేతులా మ్యాచ్ చేజార్చుకుంది. ఈ వైఫల్యాన్ని సొమ్ముచేసుకున్న పాకిస్థాన్ 10 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది.
టోర్నీలో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్.. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మహేంద్రుడి మాయాజాలం పనిచేయలేదు.. విరాట్ మంత్రదండం పనికిరాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(3), రోహిత్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(11) దారుణంగా విఫలమవ్వగా.. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 39) పర్వాలేదనిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్నందుకుంది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 79 నాటౌట్), బాబర్ ఆజామ్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 17.5 ఓవర్లలో 152 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు. ముఖ్యంగా పేసర్లు భువనేశ్వర్ కుమార్(0/25), మహమ్మద్ షమీ(0/43), జస్ప్రీత్ బుమ్రా(0/22),వరుణ్ చక్రవర్తీ(0/33), రవీంద్ర జడేజా(0/28) పోటీపడి పరుగులిచ్చుకున్నారు. మహమ్మద్ షమీ పూర్తిగా తేలిపోయాడు. టాస్ విషయం నుంచి మ్యాచ్ ముగిసేవరకు పాకిస్థాన్దే పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఈ ఓటమితో టీమిండియా టోర్నీలో తమ భవిష్యత్తును సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే.. మిగిలిన మ్యాచ్లన్నిటీని కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్ చేతిలో గనుక ఓటమిపాలైతే టీమిండియా కథ ముగిసినట్లే.