
దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ టీమ్ బయో బబుల్లో చేరింది. తన భర్త, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో కలిసి ఈ మెగాటోర్నీ పూర్తయ్యే వరకు దుబాయ్లోనే ఉండనుంది. ఇప్పటికే నిబంధనల మేరకు ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను సానియా మీర్జా పూర్తి చేసుకుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీకి సకుటుంబ సమేతంగా ఉండేందుకు ఆటగాళ్లకు ఐసీసీ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
మాలిక్తో పాటు ఇమాద్ వసీమ్, ఫకార్ జమాన్, హసన్ అలీ, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హఫీజ్, ఉస్మాన్ ఖాదిర్ కుటుంబ సభ్యులు సైతం యూఏఈలోనే ఉన్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్తో వచ్చే ఆదివారం(అక్టోబర్ 23న) జరిగే ఫస్ట్ మ్యాచ్తో పాకిస్థాన్ జట్టు తమ టీ20 ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. మెగా టోర్నీల్లో ఇప్పటి వరకు భారత్ను ఓడించని ఆ జట్టు.. ఈ సారి ఎలాగైనా ఆ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు భారత జట్టు సైతం పాకిస్థాన్ను ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. దాంతో ఇరు దేశాల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక షోయబ్ మాలిక్ పాకిస్థాన్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్. ఇప్పటి వరకు 116 టీ20 మ్యాచ్లు ఆడిన మాలిక్.. 2335 రన్స్ చేశాడు. 28 వికెట్లు కూడా పడగొట్టాడు.
భారత్-పాక్ మ్యాచ్ జరిగిన ప్రతీసారి సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. దాంతో ఈసారి సానియా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇరు దేశాల నెటిజన్ల ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాలో కనిపించకుండా పోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా మీర్జా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఏడు సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో సానియా ఉన్నట్టుండి మాయమవుతుంది. ఆ వీడియోలో ఓ పోస్ట్ కూడా ఉంచింది. 'భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రోజున చెడు వాతావరణం నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా' అని వీడియోపై కాప్షన్గా రాసింది. అంతేకాదు అలిగినట్టుగా, నవ్వుతున్నట్టుగా ఉన్న రెండు ఎమోజీలను కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో మాయమవుతున్నానని చెప్పిన సానియా.. ఇప్పుడు ఏకంగా పాక్ బయోబబుల్లోనే చేరడంతో భారత అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.