
పాక్ ఏతుల మాటలు..
ఫలితంపై భారత్ నుంచి పెద్దగా కామెంట్స్ రాకపోయినప్పటికీ.. పాకిస్థాన్ నుంచి మాత్రం 'చరిత్ర సృష్టిస్తాం', భారత్ను మట్టికరిపిస్తామనే పెద్దపెద్ద మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ జట్టు ఆ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం ఇదే తరహా కామెంట్స్ చేశాడు. భారత ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడంతో పాటు ఐపీఎల్ను కించపరిచేలా మాట్లాడాడు. భారత్ ముందు 170 లేదా 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచితే పాకిస్థాన్ సునాయసంగా గెలుస్తుందన్నాడు. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు ఇదేం ఐపీఎల్ కాదని చెప్పాడు. ఈ సారి పాకిస్థాన్ టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యాక్తం చేశాడు.

ఇదేం ఐపీఎల్ కాదు..
'టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్తో జరిగే తమ తొలి పోరులో పాకిస్థాన్ 170 లేదా 180 పరుగులు చేస్తే సునాయసంగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే భారీ లక్ష్యం ముందుంచితే భారత్ తీవ్ర కష్టాల్లో పడుతుంది. అయినా ఈ లక్ష్యాన్ని చేధించడానికి ఇదేం ఐపీఎల్ కాదు. టీ20 ప్రపంచకప్. రెండు దేశాలకు 50-50 చాన్స్ ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
అయితే ప్రతీ ఒక్కరు పాకిస్థాన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ గెలవగలదు. పాకిస్థాన్ ప్రత్యర్థి జట్టును నిరాశపర్చగలదు. సంపూర్ణ ఆధిపత్యం చెలాయించగలదు. భారత్పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. దాంతో ఆ జట్టు కృంగిపోవచ్చు'అని ఓ ఇంటర్వ్యూలో అక్తర్ చెప్పుకొచ్చాడు.

అందుకే ధోనీని తెచ్చుకున్నారు..
భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, అందుకే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్గా నియమించుకున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అన్నాడు. ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ, ముఖ్యంగా కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది చివరి వరల్డ్ కప్ కావడంతో ఒత్తిడి పెరుగుతుందన్నాడు.
ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించలేదని తన్వీర్ పేర్కొన్నాడు. టీమిండియా కీలక స్పిన్నర్ల అయిన అశ్విన్, జడేజాలు అంతగా రాణించడం లేదన్నాడు. తన దృష్టిలో పాకిస్థాన్ జట్టే ఫేవరేట్గా కనిపిస్తుందన్నాడు. భారత్పై పాక్ సునాయసంగా గెలుస్తుందనే నమ్మకం తనకుందని చెప్పాడు.

మేం ఏతులు మాట్లాడం..
పాక్ నుంచి వచ్చే ఈ తరహా వ్యాఖ్యలపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా బదులిచ్చాడు. పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని, ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటుందన్నాడు. ఆ కారణంగానే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తోందని తెలిపాడు. 'ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నాం' అని పాకిస్థాన్కి చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏబీపీ న్యూస్తో మాట్లాడిన సెహ్వాగ్.. 'మేమెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతాం.
అంతేకాని పాకిస్థాన్లా గొప్పలు చెబుతూ కూర్చోం. టీమిండియా ఎప్పుడూ అలాంటి ప్రకటనలు చేయదు. మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా సంసిద్ధమైతే ఫలితాలు అవే వస్తాయి.'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












