టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడని విమర్శించాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినా.. కెప్టెన్గా రోహిత్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని అభిప్రాయపడ్డాడు.
ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా ప్రదర్శనను విశ్లేషించిన గవాస్కర్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీరును తప్పుబట్టాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను లోయరార్డర్లో బ్యాటింగ్ చేయమంటే చేస్తారా? అని ప్రశ్నించాడు.
అత్యుత్తమ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను తొలి ఓవర్లోనే బరిలోకి దించాలని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్లను బౌలర్లు రక్షించారని తెలిపాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు చాలా నిర్లక్ష్యంగా ఆడారని అసహనం వ్యక్తం చేశాడు.
'భారత క్రికెట్లో బౌలర్లు అత్యంత అరుదుగా గుర్తింపు పొందుతారు. చాలా రోజుల తర్వాత భారత బౌలర్లు మ్యాచ్ విన్నింగ్ క్రెడిట్ అందుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తాడని భావించా. కానీ అతనికి మూడో ఓవర్ ఇచ్చారు.
అత్యుత్తమ బౌలర్కు బంతిని ఇవ్వకుండా 12 బంతులను వృథా చేయడం ఎందుకు? టీమిండియా బెస్ట్ బ్యాటర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను లోయరార్డర్లో బ్యాటింగ్ చేయమని చెప్పగలరా? వారు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టే ఓపెనర్లుగా ఆడుతున్నారు. అత్యుత్తమ పేసర్లు కూడా తొలి ఓవరే బౌలింగ్ చేయాలి.
ఏది ఏమైనా భారత్ ఆఖరి వరకు తమ జోరును కొనసాగించి విజయం సాధించింది. ముఖ్యంగా 57/1తో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్ను అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లను బౌలర్లు రక్షించారు. ఎందుకంటే బౌలర్లే బ్యాటర్ల బాధ్యతను మోసారు.
టీమిండియా బ్యాటింగ్ చాలా నాసిరకంగా కనిపించింది. చాలా మంది నిర్లక్ష్యంగా ఆడారు. అనవసరమైన షాట్స్ ఆడి వికెట్లు పారేసుకున్నారు. దాంతో 140 పరుగులు చేయాల్సిన వికెట్పై 119 పరుగులకే పరిమితమయ్యారు. 19 ఓవర్లలోనే ఆలౌటయ్యారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.