భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేదిక ఏదైనా.. టోర్నీ మరేదైనా దాయాదుల పోరు అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సాధారణ క్రికెట్ అభిమాని నుంచి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల వరకు భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఈ హైఓల్టేజ్ మ్యాచ్ టికెట్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ ప్రధానులు రికమెండ్ చేసినా టికెట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. కానీ ఆసియా కప్ 2025లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎన్నడూ లేని విధంగా స్టేడియంలోని చాలా కుర్చీలు ఖాలీగా కనిపించాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్కు ఎన్నడూ లేని క్రేజ్ ఉంటుందని నిర్వాహకులు, బ్రాడ్కాస్టర్స్ భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా పరిస్థితి నెలకొంది.

భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కట్ చేయాలనే పిలుపే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాక్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడకూడదని మెజార్టీ భారతీయులు కోరుకుంటున్నారు. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని, పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలు ఉండవని పేర్కొంది. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ), ఐసీసీ రూల్స్ ప్రకారమే పాకిస్థాన్తో భారత్ మ్యాచ్ ఆడుతుందని, ద్వైపాక్షిక సిరీస్లు ఆడదని తాజాగా వివరణ ఇచ్చింది. కానీ ఈ నిర్ణయంపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు ఈ మ్యాచ్ను వ్యతిరేకిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు సైతం ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. నెటిజన్లు బాయ్కట్ భారత్-పాక్ మ్యాచ్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు.
దాంతో ఈ మ్యాచ్ టికెట్లు సేల్ కాలేదని తెలుస్తోంది. నిర్వాహకులు టికెట్ల ధరలు తగ్గించినా.. అభిమానులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్కు భారత సెలెబ్రిటీలు దూరంగా ఉన్నారు. దేశంలో జనాలంతా ఈ మ్యాచ్ను వ్యతిరేకిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్కు హాజరై అనవసరం నెగిటివిటీని మూటగట్టుకోవడం కంటే వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్కు భారత సెలెబ్రిటీలు పోటెత్తారు. బీసీసీఐ కూడా ఈ మ్యాచ్పై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో వారి అభిమానులు ఆసక్తి కనబర్చలేదు. దాంతోనే ఈ మ్యాచ్ టికెట్లకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టేడియంలో చాలా సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.