
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ విరోచిత బ్యాటింగ్తో ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వేసిన నో బాల్పై దుమారం రేగింది. అది నో బాల్ కాదని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తుంటే.. అవుననే భారత అభిమానులు వాదిస్తున్నారు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లు పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అంపైర్లది తప్పుడు నిర్ణయమంటూ ట్వీట్ చేశాడు.
అంపైర్ భయ్యో.. మీ ఆలోచనలకు ఓ నమస్కారం.. ఈ ఆలోచనలతో ఈ రాత్రికి మీకు భోజనం పక్కా..' అని నోబాల్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. దాంతో పాక్ అభిమానులు రెచ్చిపోతున్నారు. అక్తర్ తో పాటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అంపైర్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని.. బీసీసీఐ ఐసీసీని కంట్రోల్ చేయడం వల్లే వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయని వాపోతున్నారు.
దీనికి ఇండియా ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. నడుము కంటే ఎత్తుగా వచ్చిన బంతిని ఎక్కడైనా నోబాల్ అనే అంటారని.. నోబాల్ తర్వాత ఫ్రీహిట్ కు రనౌట్ తప్ప క్యాచ్, బౌల్డ్ ఉండదని పాకిస్తాన్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ కు తెలియదా..? అని కౌంటర్ ఇస్తున్నారు.
31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్తో విజయం వైపు నడిపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యా ఔటైనా.. విరాట్ పట్టు వదల్లేదు. తన వీరోచిత పోరాటానికి కాసింత లక్ను కూడా కలుపుకొని జట్టును విజయం ముంగిట నిలబెట్టాడు. మహమ్మద్ నవాజ్ నోబాల్ వేయగా.. విరాట్ సిక్స్ను బాదాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో దినేశ్ కార్తీక్ అనవసరంగా వైడ్ బాల్ గెలికి స్టంపౌటయ్యాడు. దాంతో భారత్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠ తారా స్థాయికి చేరగా.. క్రీజులోకి వచ్చిన అశ్విన్ మాత్రం తన తెలివితో మ్యాచ్ను ముగించాడు.