న్యూఢిల్లీ: పాకిస్థాన్ సెన్సేషన్ షాహిన్ షా అఫ్రిది ధాటికి టీమిండియా మరోసారి కుదేల్ అయ్యింది. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(11), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరూ కూడా షాహిన్ షా అఫ్రిది స్వింగ్ బౌలింగ్కు చేతులెత్తేసారు.
ముందుగా రోహిత్ శర్మ... షాహిన్ షా అఫ్రిది ఇన్స్వింగర్కు క్లీన్ బౌల్డ్ అవ్వగా.. కోహ్లీ ఔట్ స్వింగర్ను ఆడబోయి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఈ ఇద్దరూ మరోసారి తమ స్వింగ్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టుకున్నారు.

ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్ అంతరాయం కలిగింది. మ్యాచ్ పున:ప్రారంభమైన తర్వాత మూడు బంతుల్లోనే రోహిత్ శర్మ వికెట్ పారేసుకున్నాడు. రోహిత్ శర్మ బలహీనతపై టార్గెట్ చేసిన షాహిన్ షా అఫ్రిది తెలివిగా బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు. తొలి రెండు బంతులను ఔట్ స్వింగర్గా వేసి ఇబ్బందిని పెట్టిన షాహిన్ షా అఫ్రిది.. ఆ మరుసటి బంతినే ఇన్ స్వింగర్గా వేసి రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు.
షాహిన్ షా అఫ్రిది బౌలింగ్కు రోహిత్ శర్మ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. నసీమ్ షా బౌలింగ్లో బౌండరీ బాది మంచి టచ్లో కనిపించాడు. కానీ షాహిన్ అఫ్రిది వేసిన 7వ ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాహిన్ షా అఫ్రిది వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని కోహ్లీ ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను తాకేసింది.
ఈ అనూహ్య ఘటనతో విరాట్ కోహ్లీ నోరేళ్ల బెట్టగా.. భారత అభిమానుల నోర్లు మూగబోయాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరచడంతో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నాడు.