అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. భారీ సిక్స్లు, బౌండరీలతో పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్లోనూ భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. అనంతరం ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్కు తన కండలను చూపించాడు.
రోహిత్ అలవోకగా సిక్స్లు బాదడం చూసి ఆశ్చరపోయిన ఎరాస్మస్.. అలా ఎలా కొడుతున్నావని అతన్ని ప్రశ్నించగా.. తన బైసెప్స్ను చూపించాడు. తన కండ బలంతోనే సిక్స్లు బాదుతున్నానని నవ్వుతూ చెప్పాడు. రోహిత్ బైసెప్స్ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. విధ్వంసకర బ్యాటింగ్తో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

షాహిన్ షా అఫ్రిది బౌలింగ్లోనే చెత్త షాట్తో వెనుదిరిగిన రోహిత్ శర్మ.. 14 పరుగుల దూరంలో సెంచరీని అందుకోలేకపోయాడు. మొత్తం 63 బంతులు ఆడిన రోహిత్ 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.