భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్తో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. శతకంతో రాణించిన విరాట్ కోహ్లీతో పాటు భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'బంతితో మేం ఆరంభించిన తీరు అద్భుతం. బౌలర్ల గొప్ప ప్రదర్శనతో పాక్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశాం. లైట్స్ కింద బ్యాటింగ్ ఈజీ అని, పిచ్ మరింత స్లోగా మారుతుందనే విషయం తెలుసు. మా బ్యాటింగ్ లైనప్లోని అనుభవం కలిగిన ప్లేయర్స్ రాణించాలనుకున్నాం. ఈ గెలుపు క్రెడిట్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజాదే.

బౌలింగ్ అద్భుతం..
మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఫార్మాట్లో వాళ్లు చాలా క్రికెట్ ఆడారు. వారి నుంచి జట్టుకు ఏం అవసరమో తెలుసుకున్నారు. రిజ్వాన్-షకీల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీలైనంత త్వరగా ఈ భాగస్వామ్యాన్ని విడదీయాలనుకున్నాం. మా ముగ్గురు స్పిన్నర్లు అనుభవంతో బౌలింగ్ చేసి మ్యాచ్పై పట్టు సాధించేలా చేశారు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీలు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు.
మా బౌలింగ్ విభాగం ప్రదర్శన చూస్తే.. ఈ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో వారి నుంచి జట్టుకు ఏం కావాలో అదే చేశారు. మాకు సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటంతో కొందరూ 10 ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆ రోజు ఎవరి బౌలింగ్ వర్కౌట్ అవుతుందో వారితోనే ఎక్కువ బౌలింగ్ చేయిస్తున్నాం. ఈ మ్యాచ్లో అక్షర్, కుల్దీప్ రాణిస్తే.. గత మ్యాచ్లో జడేజా సత్తా చాటాడు.
గాయం కాదు..
విరాట్ కోహ్లీ దేశం తరఫున ఆడటాన్ని బాగా ఇష్టపడుతాడు. అతను జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటాడు. ఈ రోజు ఆడిన తరహా ఇన్నింగ్స్ ఆడాలనుకుంటాడు. గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ ఇలానే రాణిస్తున్నాడు. కోహ్లీ శతకం చూసి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నవారు ఎవరూ ఆశ్చర్యానికి గురవ్వలేదు. అతను చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించడం బాగుంది. కోహ్లీతో పాటు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. నాకు ఎలాంటి గాయం కాలేదు. కాస్త తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాను. ప్రస్తుతం బాగానే ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.