బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని అందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం అర్థరాత్రి జరిగిన లో-స్కోరింగ్ హైఓల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది.
119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. వికెట్కు తగ్గట్లు బౌలింగ్ చేసి విజయాన్నందుకున్నామని తెలిపాడు. 'మేం బ్యాటింగ్లో విఫలమయ్యాం. జట్టుకు కావాల్సిన స్కోర్ను అందించలేకపోయాం. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సరికి మేం మెరుగైన స్థానంలో నిలిచాం. మేం భాగస్వామ్యాలు నమోదు చేయలేదు.

దాంతో మా లక్ష్యానికి కొన్ని పరుగులు తక్కువగా చేశాం. అయినా ఈ పిచ్పై ప్రతీ పరుగు ముఖ్యమనే భావించాం. ఈ వికెట్పై మేం నిర్దేశించిన లక్ష్యం సరిపోతోంది. నిజాయితీగా చెప్పాలంటే గత మ్యాచ్ కంటే ఈ వికెట్ చాలా బాగుంది. మంచి బౌలింగ్ లైనప్ ఉంటే జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది.
మేం బ్యాటింగ్ చేసేటప్పుడు నేను అందరికి ఒకటే చెప్పా. మనకు ఏదైతో జరుగుతోందో వారికి అదే జరుగుతుంది. ఎక్కువ పరుగులు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదన్నాను. జట్టు కోసం ప్రతీ ఒక్కరు సాధ్యమైనంత చేయండి. సమష్టి ప్రదర్శనే విజేతగా నిలబెడుతుందని తెలిపాను. జస్ప్రీత్ బుమ్రా తన బలాలను నమ్ముకొని బౌలింగ్ చేశాడు.
అతను ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు. అతని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచకప్ పూర్తయ్యేవరకు అతనికి మేం పూర్తి స్వేచ్చనిస్తాం. అతనో జీనియస్. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం సంతోషంగా ఉంది. మేం ఎక్కడ ఆడినా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉంటారు. ఏనాడు కూడా వారు మమ్మల్ని నిరుత్సాహపరచలేదు.
వారు నవ్వుతూ ఇంటికి వెళ్లేలా మేం చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ టోర్నీలో ఇంకా ఆడాల్సింది చాలా ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.
8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(3/21), హ్యారీస్ రౌఫ్(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(2/29) ఒక వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్(1/11)తలో వికెట్ తీసారు.