టీ20 ప్రపంచకప్ 2024 కోసం కొత్తగా నిర్మించిన నాసౌవ్ కౌంటీ న్యూయార్క్ మైదానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికెట్పై అనూహ్యమైన బౌన్స్, పేస్ ఉండటంతో బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరుగులు చేసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఔట్ ఫీల్డ్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఆటగాళ్లు భయపడుతూనే ఫీల్డింగ్ చేస్తున్నారు.
ఈ వికెట్పై ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడి విజయం సాధించిన టీమిండియా.. ఆదివారం బిగ్ మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ వికెట్పై సరైన అంచనాకు రాలేకపోతున్నామని చెప్పిన రోహిత్ శర్మ.. తాజాగా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పాక్తో మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శనివారం మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా పిచ్ గురించి జోక్స్ పేల్చి నవ్వులు పూయించాడు. ఈ పిచ్ సిద్దం చేసిన క్యూరేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడని, పిచ్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
'మేం ఎలాంటి వికెట్పై ఆడబోతున్నామో మాకే క్లారిటీ లేదు. పాకిస్థాన్ కంటే ఎక్కువ రోజులు ఇక్కడున్నా కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. చివరకు పిచ్ క్యూరెటర్ కూడా వికెట్ ఎలా ఉండబోతుందో చెప్పలేకపోతున్నాడంటే పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.'అని రోహిత్ పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ఈ కఠినపై కండిషన్స్లో రాణించాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్లుండాలని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 'ఇది చాలా కఠినమైన వికెట్. అందుకే నేను అనుభవం కలిగిన ఆటగాళ్లు అవసరమని చెబుతున్నా. ఇలాంటి వికెట్లపై ఆడి తాకించుకున్న దెబ్బలకు లెక్కలేదు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో ఇలాంటి వికెట్స్పై ఆడి సవాళ్లను అధిగమించాం. గబ్బా మైదానం ఈ కఠిన పిచ్కు ఉదాహరణగా నిలుస్తుంది.
గబ్బా మైదానంలో మేం ఈ తరహా పిచ్పైనే ఆడాం. చాలా దెబ్బలు తాకించుకున్నాం. ప్రపంచకప్కు మించినది ఏదీ లేదు. శరీరానికి ఎన్ని దెబ్బలు తాకినా ఏం కాదు. పిచ్పై కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మరీ దూకుడుగా.. నెమ్మదిగా కాకుండా బ్యాటింగ్ చేయాలి. టాపార్డర్లో ఎవరో ఒకరు స్వేచ్చగా ఆడాలి. ఈ క్రమంలోనే మేం 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.