టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికా వేదికగా జరుగుతున్న తాజా మెగాటోర్నీలోనూ పాకిస్థాన్పై టీమిండియా విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
ఈ పరాజయంతో పాకిస్థాన్ ప్లేయర్ నసీమ్ షా కన్నీటి పర్యంతమయ్యాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతి ముగియగానే నేలకూలిన నసీమ్ షా ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేపోయాడు. నసీమ్ షా కంటతడి పెట్టుకోవడాన్ని గమనించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అతని దగ్గరకు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు.

ఓటమిలో ప్రత్యర్థి ఆటగాడికి ధైర్యం చెప్పి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా.. హిట్ మ్యాన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అర్ష్దీప్ సింగ్ బంతిని అందుకోగా.. క్రీజులో ఇమాద్ వసీం, ఇఫ్తికర్ అహ్మద్ ఉన్నారు. ఇద్దరికి బిగ్ హిట్టింగ్ సామర్థ్యం ఉండటంతో ఏమైనా జరుగొచ్చని అంతా అనుకున్నారు. కానీ తొలి బంతికే ఇమాద్ వసీం కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
దాంతో క్రీజులోకి టెయిలెండర్ నసీమ్ షా వచ్చాడు. రెండో బంతి సింగిల్ తీసిన అతను.. నాలుగు, ఐదు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ టై అవుతుందన్న పరిస్థితుల్లో అర్ష్దీప్ సింగ్ కట్టుదిట్టంగా వేసాడు. దాంతో నసీమ్ షా సింగిల్ మాత్రమే తీయగలిగాడు. సింగిల్ పూర్తి చేసిన వెంటనే నసీమ్ కుప్పకూలిపోయాడు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆఖరి ఓవర్ను అద్భుతంగా వేసిన అర్ష్దీప్ సింగ్ను మెచ్చుకున్న రోహిత్.. నసీమ్ షా దగ్గరకు వచ్చి అతన్ని ఓదార్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.
8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(3/21), హ్యారీస్ రౌఫ్(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(2/29) ఒక వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్(1/11)తలో వికెట్ తీసారు.