కొలంబో: ఆసియాకప్ 2023లో సూపర్-4కు చేరిన టీమిండియా.. తొలి పోరులో మళ్లీ పాకిస్థాన్తో తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ చేయగా.. వర్షం కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు.
పాకిస్థాన్ పేస్ త్రయం నిప్పులు చెరగడంతో భారత్ టాపార్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అసాధారణ బ్యాటింగ్తో 138 పరుగుల జోడించి ఆదుకున్నారు. దాంతో 266 పరుగులు చేయగలిగింది. వర్షం వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో చెరో పాయింట్ లభించింది.

ఇరు జట్లు నేపాల్తో విజయం సాధించడంతో సూపర్-4కు అర్హత సాధించాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారని ప్రచారం జరుగుతున్నా ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా కొలంబో వేదికగా షెడ్యూల్ చేసిన సూపర్-4 మ్యాచ్లను వర్షాలు లేని హంబంటోటాకు తరలించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని కూడా ఏసీసీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో వేదిక మార్పు జరగలేదని ప్రచారం జరుగుతోంది. సూపర్-4 మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న టీమిండియా లోపాలను సవరించుకోవడంపై ఫోకస్ పెట్టింది. వర్షం పడుతుండటంతో ఇండోర్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసింది. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి జట్టుతో కలిసిన కేఎల్ రాహుల్ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డుమ్మా కొట్టారు. ఈ ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మిగతా ఆటగాళ్లు మాత్రం నెట్స్లో చెమటోడ్చారు. ముఖ్యంగా పాక్ పేస్ త్రయాన్ని ఎదుర్కొవడంపైనే ఫోకస్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు, నెట్టింట వైరల్గా మారాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ప్రాక్టీస్ సెషన్ను పర్యవేక్షించాడు.