పల్లెకెలె: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్కు తెరలేచింది. ఆసియాకప్ 2023లో భాగంగా దాయాది దేశాలు పల్లెకెలె మైదానం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ దిగింది. అయితే 4.2 ఓవర్లు వేయగానే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు.
ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం రావడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీ వర్షం కాకపోయినా.. ఈదురు గాలుతో కూడిన చిరు జల్లులు పడుతున్నాయి. వర్షం రాకతో అప్రమత్తమైన మైదాన సిబ్బంది గ్రౌండ్ను పూర్తిగా కవర్లతో కప్పివేసారు. వర్షం ఆగిన వెంటనే మ్యాచ్ పున:ప్రారంభం కానుంది.

అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూసిన హై ఓల్టేజ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడం బాలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ అభిమానులను వరణుడు ఓర్వలేకపోతున్నాడని, అతను కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అలా కాకుండా డక్వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ ఫలితం తేలాలన్నా.. ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. అలా కాకుండా ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కుదరదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇన్నింగ్స్ తర్వాత వర్షం వచ్చినా సెకండ్ ఇన్నింగ్స్ టీమ్ కనీస 20 ఓవర్లలు ఆడాలి.
పరిస్థితులను బట్టి ఓవర్లను కుదించడంతో పాటు లక్ష్యాన్ని మారుస్తారు. ఛేజింగ్లో వేయాల్సిన ఓవర్ల పర్సంటేజితో తొలి ఇన్నింగ్స్ స్కోరును గుణించి ఫలితాన్ని నిర్ణయిస్తారు.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. 18 బంతులాడిన రోహిత్ శర్మ 2 బౌండరీలతో 11 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ 8 బంతులాడి ఖాతా కూడా తెరవలేదు.
షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్ రెండో బంతిని రోహిత్ లెగ్ సైడ్ షాట్ ఆడగా.. షార్ట్ లెగ్ ఫీల్డర్ క్యాచ్ను అందుకోలేకపోయాడు. దాంతో బంతి బౌండరీకి వెళ్లగా రోహిత్ ఊపిరి పీల్చుకున్నాడు. పాక్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత ఓపెనర్లు తడబడ్డారు.