కొలంబో: ఎమర్జింగ్ ఆసియాకప్ వన్డే టోర్నీలో భాగంగా భారత్తో జరుగుతున్న ఫైనల్లో పాకిస్థాన్ 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. తాయబ్ తాహిర్(71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108) శతక్కొట్టడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది.
తాహిర్కు తోడుగా ఓపెనర్లు సైమ్ ఆయుబ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 59), సహిబ్జాదా ఫర్హాన్(62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించాడు. భారత బౌలర్లలో రాజవర్దనే హంగార్గేకర్(2/48), రియాన్ పరాగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసారు.

కొంపముంచిన నోబాల్..:ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత పేసర్ రాజవర్దనే హంగార్గేకర్ చేసిన తప్పిదం పాకిస్థాన్కు కలిసొచ్చింది. నాలుగో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సైమ్ ఆయుబ్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో అతను బచాయించాడు. అప్పటికి అతను చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే.
ఈ అవకాశం చెలరేగిన అతను హాఫ్ సెంచరీ బాదడంతో పాటు మరో ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్తో కలిసి తొలి వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ భాగస్వామ్యం ఇతర బ్యాటర్లను స్వేచ్చగా ఆడేలా చేయగా.. భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. ఓపెనర్లు ఔటైనా.. తాయాబ్ తాహిర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
ఓవైపు ఓమైర్ యూసఫ్(35), కాసిమ్ అక్రమ్(0), మహమ్మద్ హ్యారీస్(2) విఫలమైనా.. ముబాసిర్ ఖాన్(35) సాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. చివర్లో మహమ్మద్ వసీం(10 బంతుల్లో ఫోర్, సిక్స్తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పాక్ 350 పరుగులు మార్క్ను ధాటగలిగింది.
ఈ భారీ లక్ష్యాన్ని భారత్ చేధించడం కష్టమే. పాకిస్థాన్తో ఫైనల్ అనే ఒత్తిడిని అధిగమిస్తూ భారీ స్కోర్ చేయడం భారత బ్యాటర్లకు అసలు సిసలు సవాల్. హంగార్గేకర్ నోబాల్ భారత్ను దెబ్బతీయగా.. ఒత్తిడిని బౌలర్లు తట్టుకోలేకపోయారు.