కొలంబో: ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లో భారత్కు ఘోర పరాజయం ఎదురైంది. పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 128 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత ఆటగాళ్లు ఫైనల్లో మాత్రం ఒత్తిడికి చిత్తయ్యారు.
అనవసర తప్పిదాలతో మ్యాచ్ను చేజార్చుకున్నారు. రాజవర్దన్ హంగార్గేకర్ నోబాల్తో మొదలైన భారత్ తప్పిదాలు.. మ్యాచ్ ముగిసేవరకు కొనసాగాయి. మరోవైపు భారత జట్టు తప్పిదాలను అందిపుచ్చుకున్న పాకిస్థాన్ ఆటగాళ్లు చెలరేగారు. అద్భుత విజయంతో లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.

దాంతో భారత విజయం కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పాకిస్థాన్కు కాస్త లక్ కూడా కలిసి రాగా.. భారత్కు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. బ్యాటింగ్తో తాయబ్ తాహిర్ శతక్కొడితే.. బౌలింగ్లో సుఫియన్ ముఖీమ్(3/66), మహమ్మద్ వసీమ్(2/26), అర్షద్ ఇక్బాల్(2/34), మెహ్రాన్ ముంతాజ్(2/30) భారత్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినపాకిస్థాన్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. తాయబ్ తాహిర్(71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108) సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్లు సైమ్ ఆయుబ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 59), సహిబ్జాదా ఫర్హాన్(62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రాజవర్దనే హంగార్గేకర్(2/48), రియాన్ పరాగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 40 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ యశ్ ధుల్(39) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఈ మ్యాచ్కు డీఆర్ఎస్ సౌకర్యం లేకపోవడం భారత్ కొంపముంచింది. ఓపెనర్ సాయి సుదర్శన్(29), ఫస్ట్ డౌన్ బ్యాటర్ నికిన్ జోస్(11) ఔట్ నిర్ణయాలపై సందేహాలు నెలకొన్నాయి. సాయి సుదర్శన్ ఔటైన బంతి నోబాల్ అని, ఫీల్డ్ అంపైర్లతో పాటు టీవీ అంపైర్ గమనించలేదని భారత అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇక పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత పేసర్ రాజవర్దనే హంగార్గేకర్ చేసిన తప్పిదం టీమిండియా పతనానికి బాటలు వేసింది. నాలుగో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సైమ్ ఆయుబ్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో అతను బచాయించాడు. అప్పటికి అతను చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే.
ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీ బాదడంతో పాటు మరో ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్తో కలిసి తొలి వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ భారీ భాగస్వామ్యం ఇతర బ్యాటర్లను స్వేచ్చగా ఆడేలా చేయగా.. భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది.