టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. నేటి(ఆదివారం) రాత్రి 8 గంటలకు న్యూయార్క్లోని నాసౌ కౌంటీ మైదానం వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడుతూ.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతనేనని, విరాట్ కోహ్లీ కాదని పరోక్షంగా తెలిపాడు. టీమిండియా బ్యాటర్లకు దక్కే గౌరవం, గుర్తింపు బుమ్రాకు కూడా ఇవ్వాలన్నాడు.

'ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ఫార్మాట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నేను చాలా ఏళ్ల క్రితమే ఈ విషయం చెప్పాను. మనం చాలా మంది భారత బ్యాటర్ల గురించి తరుచూ మాట్లాడుకుంటాం. కానీ వారి కంటే ఎక్కువ గుర్తింపు, ప్రశంసలు జస్ప్రీత్ బుమ్రాకు దక్కాలి. కానీ దురదృష్టవశాత్తు బుమ్రాకు ఆ గుర్తింపు దక్కలేదు.
ప్రతీ ఫార్మాట్లో టీమిండియాకు అతనే ఎక్స్ ఫ్యాక్టర్. ఎలాంటి కండిషన్స్లోనైనా.. ఎంత పెద్ద టోర్నీలోనైనా బుమ్రా సత్తా చాటుతాడు. ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. ఏ ఫార్మాట్ ఆడినా అతనే ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. అతను గేమ్ ఛేంజర్. ప్రస్తుత తరంలో అతనే అత్యుత్తమ పేసర్. అతనిలాంటి బౌలర్ ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం.
చాలా మంది బుమ్రా వినూత్న యాక్షన్ వల్లే అతను అత్యుత్తమ పేసర్ అయ్యాడని చెబుతారు. కానీ నేను మాత్రం అతని ఆలోచన విధానం, బౌలింగ్పై ఉన్న నియంత్రణే కారణం అంటాను. అతని సక్సెస్కు యాక్షన్ ఒక కారణం కావచ్చు. అలాగే బౌలింగ్పై అతనికి ఉన్న కంట్రోల్ కూడా మరో కారణం. ఎంతటి విభిన్నమైన యాక్షన్ ఉన్నా బౌలింగ్పై నియంత్రణ లేకుంటే అనుకున్న విధంగా బౌలింగ్ చేయలేరు.
ఏ బౌలర్ అయినా రాణించాలంటే అతనికి సరైన ఎగ్జిక్యూషన్తో పాటు ప్రణాళిక, ఆలోచన విధానం, పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. అప్పుడే అనుకున్న రీతిలో బంతిని సంధించగలడు. ఇవన్నీ బుమ్రాలో ఉన్నాయి. ప్రస్తుతం బుమ్రానే వరల్డ్ బెస్ట్ పేసర్.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.