హైదరాబాద్: ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టుకు దాయాదీ పాకిస్ధాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ 128 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసింది. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక పోరులో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక ఓటమికి తల వంచింది.
'నో బాల్' భారత్ పతనాన్ని శాసించింది. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ నో బాలే భారత్ ఓటమికి బాటలు వేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే అదృష్టం కలిసొచ్చింది. భారత పేసర్ రాజవర్దనే హంగార్గేకర్ చేసిన తప్పిదం పాకిస్థాన్ ఇన్నింగ్స్కు ఊపిరిపోసింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సైమ్ ఆయుబ్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో అతను బచాయించాడు. అప్పటికీ అతను చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీ బాదడంతో పాటు మరో ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్తో కలిసి తొలి వికెట్కు 121 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
ఈ భారీ భాగస్వామ్యం ఇతర బ్యాటర్లను స్వేచ్చగా ఆడేలా చేయగా.. భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ ఘటన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదాన్ని గుర్తు చేసింది. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా నోబాల్తో గట్టెక్కిన ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగి భారత పతనాన్ని శాసించాడు. అప్పట్లో బుమ్రా తీవ్ర ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు హంగార్గేకర్ కూడా బుమ్రా పరిస్థితినే ఫేస్ చేస్తున్నాడు.
ఇక భారత బ్యాటింగ్ సందర్భంగా కూడా నో బాల్ కొంపముంచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన బంతి నోబాల్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంపైర్ల తప్పిదం కారణంగానే సుదర్శన్ ఔటయ్యాడని, అది క్లియర్ కట్ నోబాల్ అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం.. అది లీగల్ డెలివరీ అంటున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. తాయబ్ తాహిర్(71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108) సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్లు సైమ్ ఆయుబ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 59), సహిబ్జాదా ఫర్హాన్(62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో రాజవర్దనే హంగార్గేకర్(2/48), రియాన్ పరాగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 40 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ యశ్ ధుల్(39) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.