
దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో భారత ఓపెనర్లు దుమ్మురేపారు. అటాకింగ్ బ్యాటింగ్తో పాక్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ముఖ్య గత మ్యాచ్తో తన స్వింగ్తో బెంబేలెత్తించిన పాక్ యువ పేసర్ నసీమ్ షాకు చుక్కలు చూపించారు. దూకుడే మంత్రంగా మార్చుకున్న టీమిండియా అదే రీతిలో తమ ఆటను ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హిట్టింగ్ షురూ చేయగా.. కేఎల్ రాహుల్ సైతం అతన్ని అనుసరించాడు. నసీమ్ షా వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే రోహిత్ స్టెప్ ఔటై బౌండరీ బాదాడు. ఆ ఓవర్ చివరి బంతిని తనదైన పుల్ షాట్తో భారీ సిక్సర్గా మలిచిన రోహిత్ 11 పరుగులు పిండుకున్నాడు.
మహమ్మద్ హస్నైన్ వేసిన రెండో ఓవర్లోనూ రోహిత్ బౌండరీతో అదే జోరు కొనసాగించాడు. రోహిత్ను చూసి టెంప్ట్ అయిన రాహుల్.. నసీమ్ షా వేసిన మూడో ఓవర్ తొలి బంతినే భారీ సిక్సర్గా మలిచాడు. అదే ఓవర్ చివరి బంతిని కూడా సిక్సర్గా మలిచాడు.ఈ షాట్ మిస్టైమ్ అయినా బంతి బౌండరీ బయట పడింది. ఈ దెబ్బకు నసీమ్ షా 2 ఓవర్లకే 25 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు భారత్ 5 ఓవర్లలోనే 54 పరుగులు చేసింది.
దాంతో నసీమ్ షాపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ట్రంప్ కార్డు బౌలర్, షాహిన్ అఫ్రిది అంటూ ప్రగల్భాలు పలికిన వారు ఏం చెబుతారని కామెంట్ చేస్తున్నారు. రోహిత్, రాహుల్ ఆడిన షాట్లను నసీమ్ షా జీవితంలో మరిచిపోడని ట్రోల్ చేస్తున్నారు.
ఇక రోహిత్-రాహుల్ జోడీ జోరుకు హ్యారీస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. అతను వేసిన 6వ ఓవర్ తొలి బంతిని రోహిత్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ టైమ్ అవ్వడంతో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. షాదాబ్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే రాహుల్ సైతం భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతర క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదే జోరును కొనసాగించాడు. అయితే మహమ్మద్ నవాజ్ అతన్ని క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో పంత్, కోహ్లీ ఆడుతున్నారు.