అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్లో హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాకు శుభారంభం అందించాడు. సూపర్ బాల్తో పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)ను పెవిలియన్ చేర్చాడు. తొలి మూడు ఓవర్లలో దారుణంగా పరుగులిచ్చిన సిరాజ్.. తన నాలుగో ఓవర్లో మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్ రాబట్టాడు.
ఈ ఓవర్కు ముందు నిరాశగా కనిపించిన సిరాజ్కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పలు సూచనలు చేశారు. లెంగ్త్ విషయంలో సలహాలు ఇచ్చారు. అప్పటి వరకు స్వింగ్ కోసం ప్రయత్నించిన సిరాజ్.. సీనియర్ల సూచనలతో లెంగ్త్ మార్చుకున్నాడు. షాట్ పిచ్ బాల్స్తో పాటు లెంగ్త్ బాల్స్తో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

ఈ ఓవర్ చివరి బంతి వేసేముందు సిరాజ్తో ప్రత్యేకంగా మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. క్రాస్ సీమ్ డెలివరీ వేయాలని సూచించాడు. షాట్ పిచ్ బాల్ వేస్తున్నట్లు ఫీల్డ్లో మార్పు చేసిన ఈ ఇద్దరూ బ్యాటర్ను తప్పుదోవ పట్టించారు. క్రాస్ సీమ్ డెలివరీ లోగా రావడంతో అబ్దుల్లా షఫీక్ కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు.
రోహిత్ శర్మ ఉచ్చులో పడిన అబ్దుల్లా షఫీక్ వికెట్ పారేసుకున్నాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి బాబర్ ఆజామ్ రాగా.. పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోంది. ఏకైక మార్పుతో బరిలోకి దిగింది. తొలి రెండు మ్యాచ్లకు దూరమైన శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. లక్షా 30 వేల మంది అభిమానులు ఈ మ్యాచ్ హాజరవ్వగా.. బాలీవుడ్ ప్రముఖులు తమ ఆట పాటలతో అలరించారు.