పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మహమ్మద్ రిజ్వాన్.. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ను లాగేసుకున్నారని తెలిపాడు. టీమిండియా సమష్టిగా రాణిస్తే.. తాము సమష్టిగా మూడు విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించాడు.

'మేం టాస్ గెలిచాం. కానీ ఆ అడ్వాంటేజ్ లేకుండా పోయింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, సౌద్ షకీల్ చివరి వరకు ఆడాలనుకున్నాం. కానీ చెత్త షాట్ సెలెక్షన్తో ఔటయ్యాం. భారత బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఓడిపోయామంటేనే మూడు విభాగాల్లో మెరుగ్గా రాణించలేదని అర్థం. మేం ఈ మ్యాచ్లో గెలవాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మా నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. మేం ఫీల్డింగ్లో చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ పరంగా మేం చాలా తప్పిదాలు చేశాం.'అని మహ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/74) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, కుష్దీల్ షా తలో వికెట్ పడగొట్టారు.