సూపర్ ఓవర్లు.. సంచలన ఫలితాలతో ముందుకెళ్తున్న టీ20 ప్రపంచకప్లో బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. చిరుకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య నేడు(ఆదివారం) హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్లోని నాసౌ కౌంటీ క్రికెట్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.
దాయాదీ దేశాలు మెగా టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక సలహా ఇచ్చాడు. కోహ్లీ తన దూకుడును తగ్గించుకోని ఆడాలని సూచించాడు. స్ట్రైక్రేట్ను పట్టించుకోకుండా సహజశైలిలో బ్యాటింగ్ చేయాలని కోరాడు.

'ప్రతి జట్టుకి విరాట్ కోహ్లీకి ప్రమాదకరమే. కానీ.. పాక్తో మ్యాచ్లో కోహ్లీ కాస్త దూకుడు తగ్గించుకోవాలి. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతనిని ఔట్ చేయడం ప్రత్యర్థులకు అంత సులువు కాదు. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో కోహ్లీ ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
140-150 స్ట్రైక్రేట్కు బదులుగా 130 స్ట్రైక్రేట్తో కోహ్లీ తన ఆటని కొనసాగించాలి. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లొద్దు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. అతను ఎలాంటి షాట్స్ అయినా ఆడగలడు. కానీ స్ట్రైక్రేట్ని కొంచెం తగ్గించుకుని ఆడాలనేది నా సలహా.
కోహ్లీ 130 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు మేలు జరుగుతోంది. ఎందుకంటే 15-20 ఓవర్ల మధ్య అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. డెత్ ఓవర్లలో అతను 60-70 పరుగులు చేయగలడు. అది జట్టుకి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. కోహ్లీ ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలో వస్తేనే బాగుంటుంది.
అమెరికాలో డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడాల్సి ఉండటంతో కోహ్లీని మూడో స్థానంలో ఆడించడమే ఉత్తమం. ఫస్ట్ డౌన్లో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
మిడిల్ ఓవర్స్లో కోహ్లీ సమర్థవంతంగా ఆడగలడు. 'అని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.