అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్ ఐసీసీ ఈవెంట్లో జరిగినట్లు లేదని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ అన్నాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో జరిగిన మ్యాచ్లానే అనిపించిందన్నాడు. బీసీసీఐ సొంత కార్యక్రమంగా ఈ మ్యాచ్ తలిపించిందని ఆర్థర్ విమర్శలు గుపించాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థర్.. బీసీసీఐ తన అక్కసును వెళ్లగక్కాడు. 'ఈ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్లో జరిగినట్లు అనిపించలేదు. బీసీసీఐ సొంత కార్యక్రమంలా ఉంది. ఇది చెప్పకపోతే నేను అబద్దం ఆడినట్లే. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ ఆడినట్లు ఉంది. మ్యాచ్ సందర్భంగా ఏ దశలోనూ అభిమానులు, నిర్వాహకుల నుంచి పాకిస్థాన్ జట్టుకు మద్దతు లభించలేదు.

భారత్కు సంబంధించిన పాటలే మ్యాచ్ మొత్తం వినిపించాయి. కనీసం ఒక్కసారి కూడా 'దిల్ దిల్ పాకిస్థాన్' మ్యూజిక్ను విన లేదు. ఇది కూడా మా జట్టు ఓటమికి ఓ కారణం. కానీ, అదే ప్రధాన కారణమని మాత్రం చెప్పను. ఎందుకంటే మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. మా ఆటగాళ్ల ప్రదర్శన తీవ్ర నిరుత్సాహపరిచింది.
ఇంకాస్త దూకుడుగా ఆడాల్సింది. ఈ తప్పిదాలను సరిచేసుకొని తదుపరి మ్యాచ్ల్లో సత్తా చాటుతాం.' అని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్కు లక్షా 10 వేల మంది హాజరవ్వగా.. 99 శాతం భారత అభిమానులే ఉన్నారు.
ఐసీసీ ఈవెంట్లా లేదని వ్యాఖ్యానించిన మిక్కీ ఆర్థర్పై పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ మండిపడ్డాడు. ఎందుకు ఓడిపోయామో చెప్పకుండా ఈ చెత్త వ్యాఖ్యలు ఎందుకని విమర్శించాడు.
'ఆర్థర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో అర్థం కావడంలేదు. కుల్దీప్తో పాటు ఇతర భారత బౌలర్ల బౌలింగ్ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటి? అదే మేం వినాలనుకుంటాం. అంతేకానీ, చెత్త విషయాలు మాకు అనవసరం. అవి చెప్పలేకపోతే జట్టును వదిలి వెళ్లు. గెలుపోటములు సహజమే. కానీ, ఎందుకు ఓడిపోయామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సరిదిద్దుకోవాలి'' అని అక్రమ్ ఘాటుగా విమర్శించాడు.