అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. వరుసగా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ 171 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ దశలో 155/2 స్కోర్తో భారీ స్కోర్ చేసేలా కనిపించిన పాకిస్థాన్ 16 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది.
82 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన బాబర్ ఆజామ్(50), మహమ్మద్ రిజ్వాన్(49)జోడీని సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో విడదీయగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా డబుల్ స్ట్రోక్తో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ రివ్యూతోనే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది.

బాబర్ ఆజామ్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కుల్దీప్ యాదవ్ అతన్ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. బంతి బ్యాట్కు తాకిందని భావించిన అంపైర్ ఎరాస్మస్ నాటౌటిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ మాత్రం ఔటని భావించారు. కానీ బ్యాట్కు బంతి తాకిందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు.
అయినా రోహిత్ శర్మ ధైర్యంగా రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్కు తాకకపోగా.. బాల్ ట్రాకింగ్లో వికెట్లను హిట్ చేసింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోగా.. సౌద్ షకీల్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ ఆ తర్వాత మూడు బంతులకే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో పాకిస్థాన్ ఓకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ శర్మ.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. క్రీజులో సెట్ అయిన మహమ్మద్ రిజ్వాన్(49), షాదాబ్ ఖాన్లను బుమ్రా వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేశాడు. మహమ్మద్ నవాజ్(4)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయడంతో పాకిస్థాన్ 187 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.