ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగారు. దాంతో పాకిస్థాన్ 242 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి. స్లోగా ఉన్న ఈ వికెట్పై 242 పరుగుల టార్గెట్ పోరాడదగినదే. భారత్ ఆచితూచి ఆడకపోతే ఈ లక్ష్యాన్ని చేధించడం కష్టం.

శుభారంభం లేదు..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బాబర్ ఆజామ్(26 బంతుల్లో 5 ఫోర్లతో 23) మరోసారి తన వైఫల్యాన్ని కొనసాగించాడు. మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజామ్ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో ఇమామ్ ఉల్ హక్(10) రనౌటయ్యాడు. దాంతో పాకిస్థాన్ 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్, సౌద్ షకీల్ ఆచితూచి ఆడారు.
ఆదుకున్న షకీల్, రిజ్వాన్
టెస్ట్ తరహా బ్యాటింగ్తో నిదానంగా పరుగులు చేశారు. దాంతో చాలా సేపటి వరకు బౌండరీ నమోదు కాలేదు. హాఫ్ సెంచరీ ముంగిట సౌద్ షకీల్ బౌండరీలు కొట్టాడు. దాంతో అతను 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ ముంగిట దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మహమ్మద్ రిజ్వాన్కు ఓ లైఫ్ కూడా లభించింది. అతను ఇచ్చిన క్యాచ్ను హర్షిత్ రాణా నేలపాలు చేశాడు. కానీ ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్ పటేల్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి 104 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
కుల్దీప్ తీన్మార్..
ఆ వెంటనే సౌద్ షకీల్ క్యాచ్ ఇవ్వగా.. కుల్దీప్ యాదవ్ నేలపాలు చేశాడు. కానీ మరుసటి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా అతన్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా(19)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. తయ్యబ్ తాహిర్(4)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహిన్ షా అఫ్రిది(0)ని డకౌట్ చేసిన కుల్దీప్.. మరుసటి ఓవర్లో నసీమ్ షా(14)ను పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు కుష్దీల్ షా ఒంటరి పోరాటం చేశాడు.
ఈ ఇన్నింగ్స్లో అతనే మూడు సిక్సర్లు నమోదు చేశాడు. 43 ఓవర్ల వరకు ఈ ఇన్నింగ్స్లో ఒక్క సిక్స్ నమోదు కాలేదు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఓ సిక్స్ బాదిన కుష్దీల్ షా.. మహమ్మద్ షమీ బౌలింగ్లో మరో రెండు సిక్స్లు కొట్టాడు. ఆఖరి ఓవర్లో కుష్దీల్ షాను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.