అండర్ 19 ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్లో వేదాంత్ త్రివేది హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్లో స్పిన్నర్లు ఆయుష్ మాత్రే, ఖిలాన్ పటేల్ తీన్మార్ బౌలింగ్తో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో మెగా టోర్నీల్లో పాక్పై తమకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది(98 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 30), కాన్షిక్ చౌహన్(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), ఖిలాన్ పటేల్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21) దూకుడుగా ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్(3/32) మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సయ్యమ్(2/69) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్, మోమిన్ ఖమర్, అలీ హసన్ బలోచ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్(92 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. హంజా జహూర్(49 బంతుల్లో 8 ఫోర్లతో 42), ఫర్హాన్ యూసఫ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్(3/35), ఆయుష్ మాత్రే(3/21) మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. అంబ్రిష్, హెనిల్ పటేల్, కాన్షిక్ చౌహన్, విహాన్ మల్హోత్ర తలో వికెట్ తీసారు.

253 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ సమీర్ మిన్హాస్(9)ను హెనిల్ పటేల్ ఔట్ చేసినా.. మరో ఓపెనర్ హంజా జరూర్, ఉస్మాన్ ఖాన్ అద్భుతంగా ఆడారు. 65 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈజోడీని కాన్షిక్ చౌహన్ విడదీసాడు. హంజా జరూర్ ఔటైనా.. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్(38)తో కలిసి ఉస్మాన్ ఖాన్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అతను 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 పరుగుల భాగస్వామ్యం తర్వాత కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ను అంబ్రిష్ ఔట్ చేశాడు.
ఆ వెంటనే ఉస్మాన్ ఖాన్ను వికెట్ల ముందు ఆయుష్ మాత్రే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత పాక్ వరుసగా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బుధవారం జరిగే రెండో ఫైనల్లో అఫ్గానిస్థాన్తో భారత్ తలపడనుంది. మంగళవారం జరిగే తొలి ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు పోటీపడనున్నాయి. శుక్రవారం ఈ టోర్నీ ఫైనల్ జరగనుంది.